న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక పూర్తిగా పక్షపాతంగా ఉందని, పలు దేశాల అభిప్రాయాలను తప్పుగా చూపించిందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీష్ పర్వతనేని మండిపడ్డారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ మద్దతును ఎలిమెంట్స్ పేపర్లో సరిగ్గా ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
సోమవారం జరిగిన సమావేశంలో హరీష్ పర్వతనేని ఈ అంశంపై మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల కోసం పోరాడుతున్న దేశాలు చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు. ‘ఎలిమెంట్స్ పేపర్’కు వ్యతిరేకంగా ఎనిమిది అంశాలతో కూడిన వివరణాత్మకమైన సమాధానాన్ని ఇస్తూ.. భారతదేశ వైఖరిని ఆయన స్పష్టం చేశారు.
వివాదానికి కారణం ఏంటంటే..
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకే ‘శాశ్వత సభ్యత్వం’, ‘వీటో పవర్’ (తీర్మానాలను అడ్డుకునే హక్కు) ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఈ పాత పద్ధతిలో మార్పులు చేసి.. భారత్ లాంటి పెద్ద దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని దశాబ్దాలుగా ఓ డిమాండ్ నడుస్తోంది. భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ (ఎలిమెంట్స్ పేపర్) తయారు చేశారు. శాశ్వత దేశాల జోలికి వెళ్లకుండా.. కేవలం తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచితే సరిపోతుందని అనేలా ఎలిమెంట్స్ పేపర్ను సిద్ధం చేశారు. ఇదే వివాదానికి దారి తీసింది. ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.



