తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు.
“రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అనిత మేకప్ గురించి మాత్రమే మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్త్రీ సమాజం మాట్లాడినట్లేనని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమర్ ఏదో అన్నారని, విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది.
పవన్ దీనిమీద ట్వీట్ చేస్తారు. కట్టు, బొట్టు అంటూ ఏదేదో చెప్పారు. అనిత నోరు పారేసుకోబట్టి అమర్ మాట్లాడారు. ఆమె కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలి కదా. రాజకీయాల్లో కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరికి లూజ్ మోషన్ లాగా మాటలు విపరీతంగా వస్తాయి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతారు.
సమాజం నుంచి మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. సమాజం మీదకు రాళ్లు వేస్తే అవే తిరిగి వస్తాయని లోకేశ్, పవన్ గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ దిగజారిన మనుషులు ఉన్నారు. హోంమంత్రి ఎప్పుడైనా బాధ్యతగా మాట్లాడారా? నాలుకకు హద్దు ఉండాలి. సభ్యతగా విమర్శించండి.
పవన్, లోకేశ్ సూక్తులు చెబుతున్నారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హోదాలో అనిత స్పీచ్లు విన్నారా? విన్నవాళ్లు ఆమె మాటలను ఏమనాలి? ఆమె భాషను సరిదిద్దే ప్రయత్నం చేశారా? జగన్ను తిట్టడం కోసమే వాడుకుంటున్నారు. ఆమెతో అలా మాట్లాడించి నజరానాగా హోంమంత్రి పదవిని ఆమెకు ఇచ్చారు. కొన్ని మాటలు ఎవరు మాట్లాడినా నీచం కాదా? గతంలో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి మాజీమంత్రి రోజాను ఎలా మాట్లాడారో అందరూ చూశారు, అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే చంద్రబాబు, లోకేశ్, పవన్ ఏం చేశారు?” అని ప్రశ్నించారు.రోజాను నీచంగా తిట్టిన బండారు సత్యనారాయణను పవన్ బాగా చేశావని మెచ్చుకున్నారని పేర్ని నాని అన్నారు.
“గతంలో పవన్ కూడా రోజాపై దారుణమైన మాటలు మాట్లాడారు. మంత్రితో పాటు ఆయనకు ఇప్పుడే సంస్కారం వచ్చిందా? గతంలో మా పార్టీ నేతలను ఏదో చేస్తామని మాట్లాడారు. ఏం చేశారు అని అడుగుతున్నా. సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టా అని చెప్పారు.
హోంమంత్రి అనితను కూడా అమాయకురాలిని చేసి వాడుకుంటున్నారు. లోకేశ్ గతంలో మా నాయకుడు జగన్ గురించి.. ఆయన భార్యాపిల్లల గురించి మాట్లాడుతారు. మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ నా? మీరు సంస్కారం గురించి మాట్లాడుతారు. అమర్ మాటల్లో తప్పేముంది? అందులో అసభ్యత ఏముంది? లోకేశ్ నోరు ఉంది కదా అని అధికార మదంతో మాట్లాడితే వైసీపీ వాళ్లు కూడా అలాగే మాట్లాడుతారు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం గురించి అలా మాట్లాడవచ్చా?
ఎర్ర బుక్కు పేరుతో రాష్ట్రాన్ని దిగజార్చారు. అమర్ అనే వ్యక్తిని చిన్న వయస్సులోనే తండ్రి చనిపోతే తల్లిచాటున పెరిగారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతారు? అమర్పై 10, 15 కేసులు పెట్టి తిప్పాలని చూస్తున్నారని మాకు సమాచారం ఉంది. మీ తప్పుడు కేసులు, అరెస్టులు అతని రోమాన్ని కూడా కదల్చలేరు” అని విమర్శించారు.


















